హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఏజెంట్లా గవర్నర్ వ్యవహరిస్తున్నారని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటయిన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ వ్యవస్థనే అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ధ్వజమెత్తారు. గవర్నర్గా కాకుండా రాజకీయ పార్టీ నాయకురాలిగా పని చేస్తున్నారని మండిపడ్డారు. క్యాబినెట్ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ సొంత ఎజెండాతో గవర్నర్ పని చేస్తున్నారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చతెచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన వారికి ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశాలను కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా గవర్నర్ తీరుమార్చుకోవాలని హెచ్చరించారు.