హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంతోపాటు వారిని వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభు త్వం ఏటా రూ.18 వేల కోట్ల మేరకు రుణాలు అందిస్తున్నదని చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన హస్తకళలు, చేతివృత్తుల ఉత్పత్తి ప్రదర్శన సరాస్-2022 ను మంత్రి ప్రారంభించారు.
ఈ నెల 28 వరకు సాగే ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని 32 జిల్లాలతోపాటు దేశంలోని 22 రాష్ర్టాలకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు 300 స్టాల్స్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ఒకే వేదికపైకి చేర్చడం వల్ల వారి వ్యాపారాభివృద్ధికి కొత్త బాటలు వేసుకొనే ఆస్కారం ఏర్పడుతున్నదని చెప్పారు. జిల్లా, మండల స్థాయిలో సైతం ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన సందర్భంగా సుమారు రూ.3 కోట్ల విక్రయాలు జరిగే అవకాశమున్నదన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం సుశీల చింతల, కామారెడ్డి జెడ్పీ చైర్మన్, సెర్ప్ డైరెక్టర్ వైఎన్ రెడ్డి, ఎస్బీఐ డీజీఎం వినోద్కుమార్, ఏపీజీవీబీ జీఎం కేవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.