హైదరాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశ కార్యకర్తలు అందిస్తున్న సేవలు ఎనలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. బుధవారం మారేడ్పల్లిలోని మల్డీ ఫర్పస్ ఫంక్షన్ హాల్లో TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి ఆశాలకు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలులో స్మార్ట్ ఫోన్ లు ఆశాలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
పేద ప్రజలకు ప్రభుత్వం వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి కేవలం పరీక్షల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా పరీక్షలు, మందులు అందజేస్తున్నామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అంతేకాకుండా పేదలు అత్యధికంగా నివసించే బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి పేదల ముంగిట్లోకి ప్రభుత్వ వైద్య సేవలు తీసుకోచినట్లు చెప్పారు. ఇందులో కూడా సుమారు 56 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, డాక్టర్ రాజ శ్రీ తదితరులు పాల్గొన్నారు.