జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు
బంజారాహిల్స్, అక్టోబర్ 3: జూబ్లీహిల్స్లో సుమారు రూ.18 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యక్తులు ప్రైవేటు బోర్డు పాతారు. దీంతో స్థలం కబ్జా చేస్తున్నారని షేక్పేట మండల రెవెన్యూ అధికారులు.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్పేట మండలం సర్వే నంబర్ 403 పరిధిలో టీవీ5 కార్యాలయం సమీపంలోని సత్వా ఎన్క్లేవ్లో సుమారు 900 గజాలకుపైగా యూఎల్సీ స్థలం ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదయింది. ఈ స్థలం తమదేనంటూ తప్పుడు పత్రాలు సృష్టించిన మువ్వా రవీంద్రనాథ్, ఎం లక్ష్మీబాయి, అరుణాబాయితోపాటు మరికొంతమంది.. జీహెచ్ఎంసీ అధికారులను తప్పుదోవ పట్టించి ఆక్రమించారు. నిర్మాణ అనుమతులు కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై రెండేండ్ల కిందటే స్థానికులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రవీంద్రనాథ్తోపాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారు స్థలాన్ని మళ్లీ ఆధీనంలో ఉంచుకున్నారు. నెల కిందట స్థానికులు మరోసారి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ఆదేశాలతో సెప్టెంబర్ 1న ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. శనివారం రాత్రి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించారు. స్థలం తమదేనిని ప్రైవేటు బోర్డులు పాతారు. ఈ మేరకు షేక్పేట తాసిల్దార్ కే శ్రీనివాస్రెడ్డి ఆదేశాలతో డిప్యూటీ తాసిల్దార్ కిరణ్కుమార్ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.