హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అర్హులైన వరింగ్ జర్నలిస్టుల పాత అక్రెడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నది. హైకోర్టు ఉత్తర్వులు జారీచేసి 10 రోజులు పూర్తవుతున్నా పాత అక్రెడిటేషన్ కార్డులను పొడిగించకపోవడంతో వరింగ్ జర్నలిస్టులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్రెడిటేషన్ అర్హతలపై ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ పలు సంస్థలు, పాత్రికేయులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం గత నెల 25న విచారణ జరిపింది.
ఉభయపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈ నెల 15 వరకు వాయిదా వేసింది. అప్పటివరకు పాత అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును పొడిగించాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో తమకు మరో 20 రోజులపాటు బస్పాస్లు వస్తాయని కొందరు జర్నలిస్టులు ఆశించారు. కానీ రాష్ట్ర పౌరసంబంధాల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తమకు హైకోర్టు ఉత్తర్వుల ప్రతులు అందలేదని ప్రభుత్వం, సమాచార శాఖ, ఆర్టీసీ అధికారులు అంటున్నారు.