హైదరాబాద్: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. రంగారెడ్డి డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటువేసింది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్పై క్రిమినల్ కేసు నమోదుచేసింది. వీరితోపాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో 34 మంది మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (డీపీఎల్ క్యాంప్) చేశారు. అయితే శాస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ ఘటపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది.
ప్రభుత్వం చర్యలు తీసుకున్నవారిలో ఇబ్రహీంపట్నం దవాఖానకు సంబంధించిన డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ గీత, హెడ్ నర్స్ చంద్రకళతోపాటు మాడుగుల పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాస్, సూపర్వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల పీహెచ్సీ డాక్టర్ కిరణ్, సూపర్వైజర్ జయలత, దండుమైలారం పీహెచ్సీ డాక్టర్ పూనం, సూపర్వైజర్ జానకమ్మ ఉన్నారు.
ఇక జిల్లా హాస్పిటళ్ల వైద్య సేవల కోర్డినేటర్ (డీసీహెచ్ఎస్) ఝాన్సీ లక్ష్మిని బదిలీ చేసిన అరోగ్య శాఖ, షాద్నగర్ దవాఖానలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారికి రంగారెడ్డి డీసీహెచ్ఎస్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటికే సస్పెండ్ అయిన ఇబ్రహీంపట్నం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన
డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.