హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వాదన సరికాదని పేర్కొన్నది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేసింది.
ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన జీవో-3తో వారికి ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం స్పష్టంచేసింది. రాజేశ్కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు.. రాష్ట్ర హైకోర్టు తీర్పుననుసరించి మహిళలు, పురుషులకు రిజర్వేషన్ల ప్రకారం సమానవాటా దక్కేలా జీవోను జారీచేశామని వెల్లడించింది. సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుని తుది ఉత్తర్వులు జారీచేశామని తెలిసింది.