హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మేలు చేయాలన్న అభిమతం ప్రభుత్వానికి ఉంటే అనేక మార్గాలు ఉంటాయి. ఆ ఆలోచన, అందుకు తగ్గ కార్యాచరణ, జనానికి లబ్ధి కలిగించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కల్పించిన రెండు అవకాశాలు ప్రజలకు మానసికంగా ఊరట, ఆర్థికంగా లబ్ధి చేకూరింది. అదే సమయంలో పెద్దమొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఒకటి ఎర్లీ బర్డ్ ఆస్తి పన్ను చెల్లింపు కాగా, రెండోది ట్రాఫిక్ చలాన్ వన్ టైమ్ సెటిల్మెంట్. ఈ రెండింటి ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరగ్గా, సర్కారుకు రూ.1,041 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజల మేలు కోసం ప్రభుత్వం తీసుకొన్న ఈ రెండు నిర్ణయాలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ఆస్తి పన్నుపై రాయితీతో 738 కోట్లు
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆస్తి పన్ను చెల్లించడానికి ముందుకువచ్చే యజమానులకు ప్రోత్సాహకరంగా ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ప్రభుత్వం 5 శాతం రాయితీ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవటంతో ఆ సమయంలో రూ.738 కోట్లకు పైగా వసూలైంది. ఐదేండ్ల కింద వసూలైన దాని కంటే 95 శాతం పెరగటం విశేషం. అత్యధికంగా 4,68,55 మదింపుదారులు రూ.326 కోట్ల ఆస్తి పన్నును ఆన్లైన్లో చెల్లించారు. పౌరసేవ కేంద్రాల ద్వారా రూ.78 కోట్లు, మీసేవ కేంద్రాల ద్వారా రూ.48 కోట్లు, బిల్ కలెక్టర్ల ద్వారా రూ.256 కోట్లు వసూలయ్యాయి.
ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.303 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా వాహనాలకు పెండింగ్లో ఉన్న 3 కోట్ల చలాన్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించటంతో రూ.303 కోట్లు వసూలయ్యాయి. వాస్తవానికి ప్రభుత్వానికి వీటిమీద రావాల్సిన మొత్తం రూ.1,004 కోట్లు కాగా, ప్రభుత్వం మానవీయ కోణంలో చలాన్లపై రాయితీ కల్పించింది. బైక్లు, ఆటోలపై 75 శాతం రాయితీ, కార్లు, భారీ వాహనాలపై 50 శాతం రాయితీ, రోడ్లపై చిరువ్యాపారులకు 80 శాతం రాయితీ కల్పించటంతో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొన్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో మొదట మార్చి 1 నుంచి 31 వరకు కల్పించిన వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం మరో 15 రోజులు పొడిగించింది. తద్వారా నిమిషానికి 1,000 చలాన్లు క్లియర్ అయ్యాయి.