హన్మకొండ :సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల సహాయ సహకారాలతో రేపు ఉదయం 10.30 గంట లకునామినేషన్ వేస్తానని ప్రభుత్వ విప్, వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar) అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లో ప్రజల ఆశీస్సులతో గెలిచాను. రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామా చేశాను. ఉద్యమాలు చేశాను.
రైతుల పక్షాన విద్యుత్ సౌధలో చేసిన ఆందోళనలో అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో పెట్టినా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతూ వస్తున్నానని తెలిపారు. హన్మకొండలో అన్ని రకాల ప్రజలు, అన్ని రంగాల వారు ఉంటారు. కరోనా కష్టకాలంలో ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజల శ్రేయస్సు కోసం వైద్య సేవలు అందించామని గుర్తు చేశారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు. నాతో పాటు ఉద్యమంలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను.
నగరంలో రోడ్లు, పార్కుల నిర్మాణం చేపట్టాను. ఎడ్యుకేషన్, హెల్త్, ఐటీ హబ్గా మార్చామన్నారు.
ప్రతిపక్షాలు పిచ్చి వేషాలతో వస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్పై ఎన్ని కుట్రలు, దాడులు చేసినా తట్టుకొని నిలబడ్డం. మోదీ ఉద్యోగాల పై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చిరు వ్యాపారులపై అనుచిత వాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.