హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా తెలంగాణ అంతటా పచ్చదనాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ప్రతి జిల్లాలో ఆధునిక సమీకృత నర్సరీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో పట్టణానికి సమీపంలో 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో 5-10 లక్షల పెద్ద మొక్కలతో ఆధునిక నర్సరీలు ఏర్పాటుచేయాలన్న అటవీశాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ నర్సరీల పనులను అక్టోబర్ నాటికి ప్రారంభించాలని ఆదేశించింది. వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఎకో పార్కుల నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. అన్నింటికి కలిపి రూ.12.20 కోట్లు కేటాయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి బుధవారం జిల్లా అటవీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.