హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజాసింగ్కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. రాజాసింగ్ అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్పై హైదరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్ను తిరస్కరించడాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. పోలీసుల రిమాండ్ పిటిషన్పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండు రోజుల క్రితం రాజాసింగ్ను మంగళ్హాట్ పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదట రాజాసింగ్కు 14 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. దీన్ని రాజాసింగ్ న్యాయవాది కోర్టులో సవాల్ చేశారు. 41 సీఆర్పీసీ కండిషన్ ను పోలీసులు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో రాజా సింగ్ రిమాండ్ ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాజా సింగ్ ను విడుదల చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.