ఖమ్మం రూరల్, నవంబర్ 13: టీఆర్ఎస్-వామపక్షాలు పొత్తుపెట్టుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులతో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా చూస్తామన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ముత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వామపక్షాల పొత్తుతో మునగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారని తెలిపారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే విషయమై ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ వామపక్షాలతో పొత్తు కోరుకొన్నారని తెలిపారు.