హైదరాబాద్ : శ్రీశైలం(Srisailam) ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(RTC) సంస్థ తీపి కబురును అందించింది. మార్చి 2వ తేదీ నుంచి పది రాజధాని ప్రత్యేక ఏసీ బస్సులను ప్రారంభించనున్నది. ఈ సందర్భంగా రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ గురువారం బస్సుల వివరాలను ప్రకటించారు. ఈ బస్సు సర్వీసులు హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్(BHEL) , జూబ్లీబస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ల ద్వారా శ్రీశైలం చేరుకుంటాయని వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి గంటకు ఒక సర్వీసు శ్రీశైలానికి బయలుదేరుతుందని అన్నారు. శ్రీశైలం నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ బస్సు సర్వీసులు,ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు బస్సులు బయలుదేరుతాయని వివరించారు.
ఈ ఏసీ బస్సు సర్వీసులలో పెద్దలకు రూ. 650 ,పిల్లలకు రూ. 510 ఛార్జీలుంటాయని వివరించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణీకులను కోరారు.