రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వరించింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద ఈ అవార్డ్ దక్కింది. అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పందిస్తూ… ‘నాటు నాటు పాట గురించి చెప్పాలంటే భయంగా ఉంటుంది. ఆ పాట పర్పెక్ట్గా వచ్చేందుకు అంత కష్టపడ్డాం. కానీ ఆ కష్టమే మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. మీ ముందు ఇలా నిలబడేలా చేసింది’ అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ…‘దర్శకుడు రాజమౌళి మా చిత్రాన్ని రూపొందించిన తీరు తెలుసు కాబట్టి గోల్డెన్ గ్లోబ్ పోటీలో మేము తప్పకుండా అవార్డ్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ ‘ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన హెచ్ఎఫ్పీఏకు ధన్యవాదాలు. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్కు ధన్యావాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ గొప్ప సహకారం అందించాడు’ అన్నారు.
పాట వెనుక కథ
‘నాటు నాటు’ పాట చిత్రీకరణకు ముందు కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకుడు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వూలో చెప్పారు. “ఎన్టీఆర్, రామ్చరణ్లపై ఓ మాస్ సాంగ్ తీయాలని అనుకున్నప్పుడు ఈ పాటను యుద్ధానికి ముందు ఉక్రెయిన్లో చిత్రీకరణ చేశాం. పాటలో కనిపించే భవనం ఉక్రెయిన్ అధ్యక్షుడిది. ఆ ప్యాలెస్ పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు టెలివిజన్ నటుడు కావడంతో అడగగానే పాట షూటింగ్కు పర్మిషన్ ఇచ్చారు’ అని తెలిపారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలకు చంద్రబోస్ సన్నివేశానికి తగ్గ తెలుగు పదాలతో అందమైన సాహిత్యాన్ని అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గానంతో పాటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు.
సంతోషంగా ఉన్నది
ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ నాన్ -ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరిలో భారతీయ సినిమాకు తొలిసారి ఈ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం.
– అనిల్ కుర్మాచలం, , ఎఫ్డీసీ చైర్మన్
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారం తొలిసారిగా భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్కు రావడం మనందరికి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా కీరవాణి, చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
– ట్విట్టర్లో కేటీఆర్