కోటపల్లి, మార్చి 15 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్కు అత్యుత్తమ గుర్తింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యార్థులకు ఉచితంగా అందజేసే నోట్ పుస్తకాలపై గోల్డెన్ బాయ్ ప్రణయ్ పేరిట మొదటి పేజీలో ఫొటో ముద్రించారు.
నక్కలపల్లి గ్రామానికి చెందిన సమ్మక్క-లింగయ్యల కుమారుడైన ప్రణయ్ గురుకుల పాఠశాలలో చదువుతూ క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని జైపూర్ గురుకులంలో ఇంటర్ చదువుతున్న ప్రణయ్ గతేడాది కేరళలో జరిగిన జాతీయ స్థాయి హైజంప్, లాంగ్జంప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు.
అథ్లెటిక్స్ పోటీల్లో విశేష ప్రతిభ చూపుతున్న ప్రణయ్ను ఇటీవల రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించి రూ.3.50 లక్షల చెక్కు అందజేశారు. కాగా, చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న ప్రణయ్ను మరింత ప్రోత్సహించడంతో పాటు తోటి విద్యార్థులకు ఆదర్శంగా మార్చేందుకు నోటు బుక్పై ఆయన ఫొటో ముద్రించారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.