కోటపల్లి, మార్చి 15: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లికి చెందిన కొత్తూరి ప్రణయ్కు అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యార్థులకు ఉచితంగా అందజేసే నోట్ బుక్కులపై ‘గోల్డెన్ బాయ్ ప్రణయ్’ పేరిట మొదటి పేజీలో ఫొటో ముద్రించారు. గ్రామానికి చెందిన సమ్మక్క-లింగయ్య దంపతుల కుమారుడైన ప్రణయ్ గురుకుల పాఠశాలలో చదువుతూ, క్రీడల్లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం జైపూర్ గురుకులంలో ఇంటర్ చదువుతున్నాడు. గతేడాది కేరళలో జరిగిన జాతీయ స్థాయి హైజంప్, లాంగ్జంప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ప్రణయ్ చిత్రాన్ని నోట్బుక్పై ముద్రించారు. ప్రణయ్ను ఇటీవల మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్రోస్ అభినందించి, 3.50 లక్షల చెక్కు అందజేశారు.