సిద్దిపేట : భక్తుల కొంగు బంగారం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామికి బంగారు కిరీటం చేయిస్తున్నట్లు మంత్రులు హరీశ్ రావు , ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంత్రులు మలన్న స్వామికి చేయించే బంగారు కిరీటం నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలయాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు.
ప్రాచీన ఆలయాలకు గొప్ప ప్రాశస్త్యం తెస్తున్నామని వివరించారు. అదే తరహాలో కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అందులో భాగంగా మల్లన్న స్వామికి రూ. 4కోట్లతో ఆరున్నర కిలోల బంగారు కిరీటాన్ని ప్రభుత్వ పక్షాన చేయిస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. వచ్చే రెండు నెలల్లో స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.