Golconda fort : చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది. లైట్ షోకు సంబంధించి 30 ఏళ్ల నాటి సాంకేతిక పరిజ్ఙానం స్థానంలో సరికొత్త సాంకేతి పరిజ్ఙానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా, రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, కోట చరిత్రను ఆకర్షణీయంగా వివరించేలా అత్యాధునికంగా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ఇవాళ (బుధవారం) రాత్రికి ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రారంభించనున్నారు. పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక కట్టడాల్లో గోల్కొండ కోట ముఖ్యమైనది. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది.
11వ శతాబ్దం నాటి ఈ గోల్కొండ కోటలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌండ్ అండ్ లైట్ షోను 1993లో ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల నాటి ఈ లైట్ షో స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లైట్ షోను ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. గోల్కొండలో లైట్ షో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 30 నిమిషాల 20 సెకన్ల పాటు ఉంటుంది. గోల్కొండ చరిత్రను చూపేందుకు 3డీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై-రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికతను దీనిలో ఉపయోగించారు.