హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఎగువ రాష్ర్టాలతోపాటు తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తుండటంతో ఇటు కృష్ణమ్మ ఉరకలేస్తుండగా, అటు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. కృష్ణానదిపై ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల వరకు, గోదావరిలో గైక్వాడ్ నుంచి దిగువన ఎల్లంపల్లి వరకు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం నాగార్జునసాగర్ గేట్లను ఈ సీజన్లో తొలిసారి ఎత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక గోదావరిలో ఎగువ నుంచి ఎస్సారెస్పీకి 31 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎల్లంపల్లి దిగువన ప్రాణహిత, శబరి, ఇంద్రావతి నదుల నుంచి వరద భారీగా వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతున్నది. బుధవారం సాయంత్రానికి 50 అడుగుల వద్ద స్థిరంగా ప్రవహిస్తున్నది. 13 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. గోదావరి 55 అడుగులకు చేరే అవకాశం ఉన్నదని, నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు సూచించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం 9.8 అడుగులకు చేరుకున్నది.
రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వెల్ల డించింది. ఈ నెల 13న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదిలి 24 గంటల్లో బలపడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో 14న మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.