కరీంనగర్ : తెలంగాణ సాధించుకున్న లక్ష్యం నెరవేరుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే మనం కొట్లాడం. స్వరాష్ట్రంలో 1,30,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar )అన్నారు. ప్రథమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారధి స్టడీ సర్కిల్లో చదువుకొని ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రతిమ ఫౌండేషన్ డైరెక్టర్లు హరిణి, ప్రతిక్, మేయర్ సునీల్ రావుతో కలిసి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటికే 80 వేల పోస్టులకు, ఉపాధ్యాయ నియామకాల కోసం కోసం నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. జిల్లా గ్రంథాలయాన్ని తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆరంతస్తుల్లో ఇంటర్నేషనల్ లైబ్ర రీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ప్రపంచంలో దొరికే ప్రతి ఒక్క పుస్తకం ఆన్లైన్ వేదికగా మీకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
వీటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు జీవితాల్లో విజయాలు సాధించాలని ఆయన తెలిపారు.
ప్రతిమ ఫౌండేషన్ వారధి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తాం. ప్రతిరోజు ఒక నిపుణులతో తరగతులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.