హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ దిగుమతికి జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యాలో తయారైన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లు 27.9 లక్షల డోసులతో కూడిన 56.6 టన్నులు మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటలకు చార్టర్డ్ ఫ్రైటర్ ఆర్యూ-9450 ద్వారా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్కార్గోకు చేరాయి. ఇప్పటివరకు భారత్కు వచ్చిన కొవిడ్ వ్యాక్సిన్ దిగుమతుల్లో ఇదే అతిపెద్దది. గతంలో 2.1 లక్షల డోసులు కలిపి మొత్తం 30 లక్షల డోసుల స్పుత్నిక్- వీ వ్యాక్సిన్ భారత్కు వచ్చింది. మరో 20 లక్షల వ్యాక్సిన్లు త్వరలో వచ్చే అవకాశం ఉన్నది. ఈ వ్యాక్సిన్ను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు జీహెచ్ఏసీ వద్ద ఉన్నాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్, చుట్టుపకల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. వీటిని సజావుగా నిర్వహించేందుకు జీహెచ్ఏసీ అన్ని వసతులను ఏర్పాటు చేసింది. టెంపరేచర్ కంట్రోల్డ్ మౌలిక సదుపాయాలతోపాటు భారత్లో మొట్టమొదటి డెడికేటెడ్ ఫార్మా కార్గో ఎగుమతి టెర్మినల్ అయిన ‘ఫార్మా జోన్’ సామర్థ్యాన్ని విస్తరించింది.
టెర్మినల్ నుంచి విమానం వద్దకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా సరుకులను రవాణా చేసేందుకు టెంపరేచర్ కంట్రోల్డ్ ‘కూల్ డాలీ’ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఔషధాల్లాంటి ఇతర కొవిడ్ సహాయ సామగ్రికి ప్రాధాన్య ప్రాతిపదికపై త్వరగా అనుమతులు లభించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వ్యాక్సిన్లు, మందుల నిల్వ, పంపిణీకి భారత్లో జీహెచ్ఏసీ ఎంతో మెరుగైన పద్ధతులను అనుసరిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు, వాటిని ఎలాంటి ఆటంకాల్లేకుండా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి జీహెచ్ఏసీలో అత్యుత్తమ సదుపాయాలున్నాయి. పెరిషబుల్స్, వ్యవసాయోత్పత్తులు, టెంపరేచర్ కంట్రోల్డ్ ఔషధాల రవాణా కోసం జీహెచ్ఏసీ ల్యాండ్ సైడ్, ఎయిర్ సైడ్లో మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నది.
స్పుత్నిక్-వీ టీకాలు దేశీయ మార్కెట్లోకి వచ్చేందుకు మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి దిగుమతి అయిన మొదటి బ్యాచ్ డోసులను కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ (సీడీఎల్) పరీక్షించి అనుమతులు ఇచ్చింది. దీంతో మొదటి బ్యాచ్లోని 1.50 లక్షల డోసులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు దాదాపు మార్గం సుగమమైనట్టే. హైదరాబాదీ ఫార్మాసంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్.. ఈ నెలలోనే ఈ టీకాను ప్రజలకు అందుబాటులోకి తేనున్నది.