హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొత్తం 31 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) కాంట్రాక్టర్ను ఎంపిక చేసేందుకు రూ.5,688 కోట్ల అంచనా వ్యయంతో ఓపెన్ టెండర్లను ఆహ్వానించినట్టు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. మూడేండ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ నిర్మాణాలు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు, రోలింగ్ స్టాక్ (రైలు) సరఫరా,కమిషనింగ్ సహా అన్ని సివిల్ నిర్మాణాలను కాంట్రాక్టు పొందిన సంస్థే చేయాల్సి ఉంటుంది. వాటితోపాటు మెట్రో మార్గంలో విద్యుత్తు ట్రాక్షన్, విద్యుత్తు సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఎఎఫ్సీ) గేట్లను సైతం కాంటాక్టు సంస్థే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రాథమిక సర్వే పనులు పూర్తి
రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొదలయ్యే ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు కోసం ఇప్పటికే హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రోరైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సర్వే, పెగ్ మారింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ లాంటి ప్రాథమిక పనులు చాలా వరకు పూర్తయ్యాయని, భూసార పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం 31 కి.మీ. పొడవైన ఈ కారిడార్లో 29.3 కి.మీ. ఎలివేటెడ్ మార్గం, 1.7 కి.మీ. భూగర్భ మార్గం ఉంటుంది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్కు ఆనుకుని ఉండే ఓ భూగర్భ మెట్రో స్టేషన్ సహా మొత్తం 9 స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఎయిర్పోర్టు మెట్రో మార్గంలో బహుళ అంతస్థులతో కూడిన ఆకాశహర్మ్యాలు పెద్ద ఎత్తున నిర్మితమవుతున్నాయి. ఆ శివార్లలో తకువ ఖర్చుతో కూడిన వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రజారవాణా మరింత పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మార్గం చుట్టు పక్కల ఉన్న ఐటీ కంపెనీలకు వచ్చివెళ్లేవారు మెట్రో రైళ్లలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆ మేరకు భవిష్యత్తులో అవసరమైన చోట మరో 4 మెట్రో స్టేషన్లు నిర్మిస్తామని, అదనపు స్టేషన్ల నిర్మాణానికి కూడా టెండర్లో ఓ నిబంధనను పొందుపర్చామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
బిడ్ల దాఖలుకు జూలై 5 చివరి తేదీ
ఎయిర్పోర్టు మెట్రో మార్గం నిర్మాణానికి అర్హులైన కంపెనీలు జూలై 5 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు సమర్పించాలని, అందుకు సంబంధించిన పత్రాలను ఈ నెల 17 నుంచి 29 వరకు హెచ్ఏఎంల్ కార్యాలయం నుంచి పొందాలని అధికారులు పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలంగాణ ప్రభుత్వ ఈ-పోర్టల్ (https://tender.telangana.gov.in)ను సంప్రదించాలని సూచించారు. టెండర్ పత్రాలను ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తామని, వాటిని బిడ్డర్లు యాక్సెస్ చేయవచ్చని తెలిపారు.