రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న దివంగత మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీదేవికి ఒక్క అవకాశమివ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి పట్టభద్రులను కోరారు. శనివారం మంత్రి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. మొదటిసారి మహిళా అభ్యర్థిగా బరిలో ఉన్న ఎస్ వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పెద్దల సభకు పంపాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్తోనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించిందని, గత ఆరున్నరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏ రాష్ట్రంలో లేనివిధంగా అధిక వేతనాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని, త్వరలోనే 29 శాతం పీఆర్సీ కూడా ఇవ్వనున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. ప్రతి ఒక్క ఓటరు జాగ్రత్తగా ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని ఆశీర్వదించాలని మంత్రి కోరారు.