హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నూతన జిల్లాలకు కొత్త పోస్టులను మంజూరు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో), తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) నేతలు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చేపట్టేముందు నూతన జిల్లాలకు జనాభా ప్రాతిపదికన అదనపు పోస్టులను మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఉద్యోగుల విభజనను పూర్తిచేసి 2016 నుంచి అమలుచేస్తున్న ఆర్డర్ టు సర్వ్ విధానాన్ని పూర్తిగా రద్దుచేయాలని కోరారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో టీఎన్జీవో, టీజీవో నేతలు శుక్రవారం వేర్వేరుగా సమావేశమై వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 33 జిల్లా క్యాడర్లు, 7 జోనల్ క్యాడర్లు, 2 మల్టీ జోన్లుగా ఏర్పాటుచేసి స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ను కల్పించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
సీనియారిటీ నష్టపోకుండా చూడాలి
జోన్ మారేటప్పుడు ఉద్యోగులకు పాత సీనియారిటీనే కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తిచేశారు. పాత ఉద్యోగులకు పాత జిల్లా, జోనల్ సీనియారిటీని కొనసాగిస్తూ, కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులకే 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ విధానాన్ని వర్తింజేయాలని కోరారు. సచివాలయంలోకి అన్ని శాఖల హెచ్వోడీల నుంచి 12.5 శాతం ఉద్యోగులను కేటాయించే కోటాను పునరుద్ధరించాలన్నారు. పదోన్నతులకు సంబంధించి మూడేండ్ల కనీస సర్వీసును రెండేండ్లకు తగ్గిస్తూ శాశ్వత ఉత్తర్వులు జారీచేయాలని, ఉద్యోగులకు ప్యానల్ ఇయర్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని కోరారు. పీఆర్సీలోని వ్యత్యాసానాలను సవరించడానికి అనామలీస్ కమిటీ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకశాతం చందాతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సౌకర్యాన్ని అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చలామణి అయ్యేలా ఏర్పాటుచేయాలని కోరారు. విజ్ఞప్తిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కా ర్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆర్థికశాఖ సలహాదారు శివశంకర్, జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి అప్పారావు, ఉద్యోగసంఘాల నేత లు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, మమత, సత్యనారాయణ, రవీందర్కుమార్, రామినేని శ్రీనివాస్రావు, కస్తూరి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, ఎండీ ముజీబ్ హుస్సేనీ, శ్రీరామ్, చందు, ఎంబీ కృష్ణాయాదవ్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, సబిత పాల్గొన్నారు.