TS EAPCET | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ): అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులవైపే అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. అబ్బాయిలు ఇంజినీరింగ్ అంటే ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఎప్సెట్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతున్నది. ఈసారి ఇంజినీరింగ్కు అబ్బాయిలు 1,50,600 (60శాతం) మంది దరఖాస్తు చేస్తే, అమ్మాయిలు కేవలం 1,03,862 (40శాతం) మంది దరఖాస్తు చేశారు.
అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అమ్మాయిలు 73,224 (73శాతం) మంది దరఖాస్తులు సమర్పిస్తే, అబ్బాయిలు కేవలం 27,003 (27శాతం) మంది మాత్రమే దరఖాస్తు చేశారు. సోమవారం కూకట్పల్లి జేఎన్టీయూలో మే 7 నుంచి 11 వరకు జరగనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు వివరాలు వెల్లడించారు.
నిరుటి కంటే పెరిగిన దరఖాస్తులు
నిరుటితో పోల్చితే ఈ ఏడాది ఇంజినీరింగ్కు దరఖాస్తులు పెరగగా, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి తగ్గాయి. ఈఏడాది ఇంజినీరింగ్కు 50వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. ఈసారి ఎప్సెట్- 2024 పరీక్షకు 3.54 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ హాల్టికెట్ల డౌన్లోడింగ్ సోమవారం నుంచే ప్రారంభమైందన్నారు. ఇక ఇంజినీరింగ్ హాల్టికెట్లను మే 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఫలితాలను మే నెలాఖరులో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఎప్సెట్ పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ను వినియోగించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర్రావు, ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి, ప్రొఫెసర్ తారాకళ్యాణి, ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, ప్రొఫెసర్ అరుణకుమారి పాల్గొన్నారు.
యూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
యూజీసీ నెట్ పరీక్షలపై సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఎఫెక్ట్ పడింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో 16న జరగాల్సిన నెట్ పరీక్షను జూన్ 18కి వాయిదావేసినట్లు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ వెల్లడించారు. అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షను వాయిదావేశామన్నారు.