కరీంనగర్ : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తమ ప్రేమను పెద్దలు తిరస్కరిస్తారనే భయంతో.. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆ జంట పరార్ అయింది. ఆగ్రహంతో ఊగిపోయిన యువతి కుటుంబ సభ్యులు.. యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్కు చెందిన ఓ జంట గత కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పారిపోయారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రియురాలి కుటుంబ సభ్యులందరూ యువకుడి ఇంటికి వెళ్లారు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఇంట్లో ఉన్న ఫర్నిచర్, విలువైన వస్తువులు కాలిపోయాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.