సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 9: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి అద్భుత ప్రతిభ చాటారు. 5 గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీర, పట్టువస్ర్తాలు తయారు చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి బంగారు పట్టువస్ర్తాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరను బహూకరించారు.
ఆదివారం తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ జవహర్రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వాటిని అందజేశారు. స్వామివారికి రూ.45 వేల విలువ చేసే బంగారు ధోతితోపాటు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో తయారు చేసిన ఝరీ చీరను అందజేసినట్టు విజయ్ తెలిపారు. శ్రీవారికి ధోతీ, పద్మావతి అమ్మవారికి చీరను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానని విజయ్ తెలిపారు.