మంత్రి కేటీఆర్ జన్నదినం ఆ దివ్యాంగుడికి వరంగా మారింది. మంత్రి జగదీష్ రెడ్డి ఔదార్యం అతని ఉన్నత విద్యాభ్యాసానికి మెట్టయింది. మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి తన మొరని వినిపించుకుందామని వచ్చిన ఆ దివ్యాంగుడికి మంత్రి కేటీఆర్ జన్నదిన వేడుకలు కలిసి వచ్చాయి.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామవాసి అయిన దివ్యాంగుడు చిత్తలూరి వేణు ఏఎస్బీఎం విశ్వవిద్యాలయంలో యంబీఏ స్పెషలైజేషన్ కోర్సులో సీటు వచ్చింది. ఆ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం ఫీజుగా రూ.1,76,475 చెల్లించే స్థోమత లేక వేణు.. మంత్రి జగదీష్ రెడ్డి తోడ్పాటునందిస్తారన్న ఆశతో బంజారాహిల్స్కు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి తన పరిస్థితి వివరించారు.
దానిపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి.. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్కు ఈ సంగతి వివరించారు. చిత్తలూరి వేణుకు చేయూతనందించాలంటూ సూచించారు. అందుకు అనుగుణంగా స్పందించిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్.. తన అభిమాన నేత మంత్రి కేటీఆర్ జన్నదినాన్ని సందర్భంగా `గిఫ్ట్ ఏ స్మైల్` కింద అప్పటికప్పుడు రూ.1,76,475 చెక్ అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.