Armour Turmeric | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపునకు జీఐ ట్యాగ్(భౌగోళిక గుర్తింపు) రానున్నది. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. విశిష్టత కలిగిన ఈ పసుపు రకానికి జీఐ ట్యాగ్ కోసం నాబార్డు సహకారంతో శాస్త్రవేత్తలు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, భూమి లక్షణాలు, ఇక్కడి పసుపులో ఉండే ప్రత్యేక లక్షణాలు, సాగు చరిత్ర, డాక్యుమెంటరీ ఆధారాలపై వివరాలను సేకరించారు. స్వయంగా పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు, సాగుచేస్తున్న పసుపు రకాల విశిష్టతను రైతులను అడిగి తెలుసుకున్నారు.
జీఐ ట్యాగ్ కోసం చెన్నైలోని మేధోసంపత్తి హక్కుల కేంద్రానికి నాలుగు నెలల్లో దరఖాస్తు చేస్తామని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్, ప్రధాన పరిశోధకుడు డాక్టర్ పిడిగం సైదయ్య తెలిపారు. ఆర్మూర్ పసుపునకు భౌగోళిక గుర్తింపు వస్తే ఎగుమతులు పెరిగి, దేశవ్యాప్తంగా అధిక ధర పలుకుతుందని పేర్కొన్నారు. త్వరలోనే పసుపు డీఎన్ఏ ప్రొఫైలింగ్, నమునాలను పరిశీలించి అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. బృందంలో కమ్మర్పల్లి పసుపు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు బీ మహేందర్, పీ శ్రీనివాస్, నాబార్డ్ డీడీ ప్రవీణ్కుమార్ తదితరులు ఉన్నారు.