ఘట్కేసర్ రూరల్, జూన్ 25: దేశవ్యాప్తంగా నిరుద్యోగులను నిండాముంచిన బీజేపీ నాయకుడు, సైబర్ నేరగాడు చక్రధర్గౌడ్ను కిడ్నాప్ కేసులో ఘట్కేసర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లికి చెందిన కీసర అవినాశ్రెడ్డి, బుద్ధానగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చేరెడ్డి మల్లారెడ్డి కుమార్తె అరోషికారెడ్డి అలియాస్ అన్షితారెడ్డి 8 ఏండ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఈక్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ అవినాశ్రెడ్డి నుంచి పలు దఫాలుగా అన్షిత రూ. 25 లక్షలు తీసుకున్నది.
ఆ తర్వాత విభేదాల కారణంగా అవినాశ్కు దూరమైన అన్షిత మూడేండ్ల క్రితం బీజేపీ నాయకుడైన చక్రధర్గౌడ్ ప్రేమలో పడింది. ఆమెను పెండ్లి చేసుకున్నట్టు కూడా చక్రధర్ పలుమార్లు చెప్పుకున్నాడు. మరోవైపు, అన్షిత-అవినాశ్రెడ్డి మధ్య రూ. 25 లక్షల విషయమై కొన్ని రోజులుగా పంచాయితీ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న మైసమ్మగుట్ట సమీపంలోని వందన హోటల్ వద్దకు ఆదివారం అవినాశ్రెడ్డిని పిలిపించిన చక్రధర్.. అన్షితతో దిగిన ఫొటోలను డిలీట్ చేయాలని కోరాడు.
తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే డిలీట్ చేస్తానని అవినాశ్ చెప్పడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అది విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అవినాశ్రెడ్డిని బలవంతంగా కారులోకి ఎక్కించిన చక్రధర్ కిడ్నాప్కు యత్నించాడు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అవినాశ్ను వదిలేసి తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుచరుడు గౌతమ్తో కలిసి కారులో పరారవుతున్న చక్రధర్ను పీర్జాదిగూడలో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.