Post office | యాచారం, మే 3: రంగారెడ్డి జిల్లా యాచారం పోస్టాఫీస్లో ఘరానా మోసం చోటుచేసుకున్నది. రూ.30లక్షలకుపైగా ఖాతాదారుల సొమ్మును ఓ అధికారి కాజేశాడు. పోస్టాఫీస్లో ఖాతాదారులు జమ చేసుకున్న డబ్బులను లెక్కల్లో చూపకుండా నొక్కేశాడు. ఈ ఘటన ఉన్నతాధికారుల విచారణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ మహిళ తన ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకోవడానికి తపాలా కార్యాలయానికి వెళ్లింది. పాసు పుస్తకంలో రాసి ఉన్నన్ని డబ్బులు.. ఆన్లైన్లో చూపించడం లేదు.
చాలామందికి ఇలాంటి సమస్యే ఎదురైంది. దీంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సౌత్ జోన్ ఏఎస్పీ నర్మద బుధవారం విచారణ చేపట్టి.. ఖాతాదారుల వివరాలను, లావాదేవీలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. సుమారు రూ.30 లక్షలకు పైగా ఖాతాదారుల సొమ్ము స్వాహా అయినట్టు ఆమె గుర్తించారు. ఇదంతా తపాలా అధికారి రహమాన్ ఉన్నప్పుడు చోటు చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అవకతవకలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని, ఖాతాదారుల సొమ్ము తిరిగి వచ్చేలా కృషి చేస్తామని నర్మద తెలిపారు.