ICRISAT | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తక్కువ కాలవ్యవధిలో అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు పుష్కలంగా పోషకాలను కలిగి ఉండే కొత్త రకం వేరుశనగ వంగడాన్ని ఇక్రిశాట్ అభివృద్ధి చేసింది. జునాగఢ్ వర్సిటీతో కలిసి జీజీ 39 పేరిట రూపొందించిన ఈ రకం పల్లీలు పరిమాణంలో పెద్దగా ఉండటంతోపాటు డ్రైఫ్రూట్స్లో మాత్రమే లభించే ఓలిక్ యాసిడ్ను సైతం కలిగి ఉండం విశేషం. వానకాలం సీజన్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ విత్తనాలు ప్రస్తుతం ఉన్న వినియోగంలో విత్తనాల కంటే ఎంతో మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఇక్రిశాట్ వర్గాలు చెప్తున్నాయి.
వానకాలంలో నీటి లభ్యత అధికంగా ఉండటం వల్ల నేలలో తేమ శాతం పెరిగి వేర్లకు తెగుళ్లు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి తెగుళ్లనైనా తట్టుకుని వేగంగా ఎదిగేలా జీజీ 39 వేరుశనగ వంగడాలను అభివృద్ధి చేశారు. గుండె జబ్బులను నియంత్రించడంలో ఓలిక్ యాసిడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గుండె నాళాల్లో కొవ్వులు చేరకుండా నిరోధిస్తుంది. ఈ నేపథ్యంలో ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశనగను అందుబాటులోకి తెస్తే పోషకాహార కొరత తీరుతుందని, జీజీ 39లో నూనె శాతం కూడా ఎక్కువగా ఉంటుందని ఇక్రిశాట్ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఈ విత్తనాలను గుజరాత్లో ప్రయోగాత్మకంగా సాగుచేసి, ఫలితాల ఆధారంగా వచ్చే ఖరీఫ్ నాటికి తెలుగు రాష్ర్టాల్లోనూ వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు వివరించారు.