మహబూబాబాద్ : కరోనా లక్షణాలు ఉన్న అందరికి పరీక్షలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్-19పై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పెట్టారు.
లాక్ డౌన్ ఉన్నా వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షల సామర్థ్యం, ఐసోలేషన్ కేంద్రాలు పెంచుకోవాలన్నారు. మరణాలను ఏ విధంగా అరికట్టాలి. కరోనా బారిన పడకుండా తీసుకునే చర్యలు ఇంకా ఎలా పెంచాలి అనేదానిపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
వ్యాక్సిన్ పూర్తిగా నిర్దిష్ట పద్దతిలో వినియోగించుకోవాలి.రెమిడెసివర్ సరఫరా, ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఎక్కువ ఉండేలా చేసుకోవాలన్నారు. ఇంటింటికి జరుగుతున్న ఫీవర్ సర్వే సమగ్రంగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, శంకర్ నాయక్, హరిప్రియ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్ , కలెక్టర్ వి.పి గౌతమ్, అదనపు కలెక్టర్ అభినవ్ అభిలాష అధికారులు పాల్గొన్నారు.