నిజామాబాద్: మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి బీజేపీ దిగజారిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలంగాణ పల్లెలు అభివృద్ధి చెందాయని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందునే తెలంగాణ పల్లెలు ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి చెప్పారు.
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో రూ.5.11 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహెబ్ పేట, వెంకటాపూర్ గ్రామాల్లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతున్న బీజేపీ నాయకులను సీఎం కేసీఆర్ తిట్టడం వంద శాతం కరెక్టే అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిందని మండిపడ్డారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 87 నవోదయ విద్యాలయాలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదని, 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు కేటాయించలేదన్నారు. నిధులు ఇవ్వడంలో వివక్ష చూపడమే కాకుండా తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.
పార్లమెంట్ వేదికగా రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాటల వెనుక ఆంతర్యం ఏంటని మంత్రి వేముల ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు మోదీని, అమిత్ షాను ఎందుకు అడగరని నిలదీశారు. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేండ్లు అవుతున్నా.. స్వయంగా ప్రధానే పార్లమెంట్ వేదికగా పలు మార్లు రాష్ట్ర విభజన మీద మాట్లాడున్నారంటే కచ్చితంగా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రలో భాగంగానే చూస్తామన్నారు. తెలంగాణను చిన్నచూపు చూస్తున్న బీజేపీ మాయలో పడితే గోస పడుతామని, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత దీనిపై ఆలోచన చేయాలని మంత్రి కోరారు.