హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో అంతర్జాతీయ సంస్థ రానున్నది. జర్మనీకి చెందిన ఆటోమోటివ్ దిగ్గజం జడ్ఎఫ్ హైదరాబాద్లో తన అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం జ్యూరిచ్లో ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అనంతరం మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘హ్యాపనింగ్ హైదరాబాద్.. పెరుగుతున్న మొబిలిటీ స్పేస్కు హైదరాబాద్ ఓ నిదర్శనం.
జర్మన్ ఆటోమోటివ్ రంగంలో కీలకమైన జడ్ఎఫ్ 3,000 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఆ సంస్థ భాగస్వామి కానున్నది. ప్రపంచవ్యాప్తంగా 18 ప్రధాన అభివృద్ధి కేంద్రాలను కలిగి ఉండి దాదాపు 100 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జడ్ఎఫ్కు హైదరాబాద్లోని కార్యాలయం అతిపెద్దది అవుతుంది. నానక్రామ్గూడలో జూన్ 1న ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నది’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.