హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రజలకు త్వరలోనే అతి తక్కువ ధరకే సాధారణ ఔషధాలు లభ్యంకానున్నాయి. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్ ఔషధ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో 500పైగా గ్రామీణ మండలాలు ఉండగా.. మొదటిదశలో 100 మండలాల్లో దుకాణాలు తెరుచుకోనున్నాయి. వీటి ఏర్పాటు కోసం అవసరమైన రుణాన్ని అందించాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది. ఒక్కో దుకాణానికి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుందని లెక్కలు వేసింది. బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు లేదా కుటుంబసభ్యులు, వారి పిల్లలకు ఈ షాపులు ఏర్పాటుచేసుకొనే అవకాశం కల్పిస్తారు. మెడికల్ షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉండటంతో ఉన్నతాధికారులతో స్త్రీనిధి సంస్థ సంప్రదింపులు జరిపింది. అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.