జయశంకర్ భూపాలపల్లి : వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రణభేరి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లైన్ లో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ కు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డిలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మిరియాల రాజిరెడ్డి లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో సింగరేణి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.
కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కార్మికుల జీవితాలతో యాజమాన్యం, ప్రభుత్వం ఆడుకుం టుందని విమర్శించారు. సింగరేణిలో రక్షణ పరికరాలు సరఫరా చేయని దుస్థితి నెలకొందన్నారు. మూడేండ్ల కాలంలో ఒక్క మెడికల్ బోర్డు పెట్టి 100 పైగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను ఇంటికి పంపించి, కేవలం 12 మందిని మాత్రమే అన్ ఫిట్ చేసి చేతులు దులుపుకున్నారన్నారనీ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ , టీబీజీకేఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.