హైదరాబాద్ సంస్థానంలో 1934లో గాంధీజీ తలపెట్టిన పర్యటనపై ప్రభుత్వ పెద్దల్లో చాలా మల్లగుల్లాలే నడిచాయి. హైదరాబాద్కు వస్తున్న మహాత్ముడు స్వాతంత్య్ర పోరాటంపై ఏమీ మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు. గాంధీజీ వచ్చేది హరిజన అభ్యుదయ కార్యక్రమం కోసం కావడంతో చివరకు అనుమతి ఇచ్చారు. 1934 మార్చిలో గాంధీజీ ఇక్కడకు వచ్చారు. హరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానికులు పెద్దఎత్తున డబ్బు పోగేసి గాంధీజీకి పర్సు బహూకరించారు. నగరంలోని కాచిగూడలో గల ఓ వాడకు గాంధీజీ ‘హరిజన బస్తీ’ అని పేరుపెట్టారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. జాతీయ నాయకులపై ఇక్కడి సర్కారు అమలు చేసిన నిర్బంధాలను ఈ ఘటనలు కళ్లకు కడుతున్నాయి. ఇంతటి నిషేధాలు, నిర్బంధాల మధ్య జాతీయవాద కార్యకలాపాలు కొనసాగడం విశేషం.