హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేసిన అరవింద్ను తెలంగాణ ప్రజలు తప్పకుండా తరిమికొడుతారని హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవితో కలిసి గజ్జల కాంతం మీడియాతో మాట్లాడారు.
అరవింద్కు రాజ్యాంగం మీద అవగాహన లేదు. ప్రజలను నమ్మించి మోసం చేశారు. మహిళలంటే గౌరవం లేదు. వాస్తవానికి రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తికి ఎంపీ అయ్యే అర్హత లేదు. కల్వకుంట్ల కవితను ఇష్టమొచ్చినట్లు విమర్శించడం సరైంది కాదు. నీకు అక్కాచెల్లెళ్లు ఉన్నారో తెలియదు. నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఎలా గౌరవిస్తున్నావో అలా గౌరవించాలి. అరవింద్కు భయం మొదలైంది. నిజామాబాద్లో ఓడిపోతాననే భయంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఆడబిడ్డలను విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటు అయిపోయింది. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఆడవాళ్లను అగౌరవపరుస్తున్నారు. ఆడవారిని గౌరవించడం నేర్చుకోవాలి.
అరవింద్ ప్రజాప్రతినిధి కావడం బాధాకరం. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గెలిచే ప్రసక్తే లేదు. ఆయనకు ఎంపీగా ఇదే చివరిసారి. వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీగా కూడా ఆయన గెలవలేడు. ఆడవారిని లెక్క చేయడం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై కూడా విమర్శలు చేస్తున్నారు. కులాలను అవమాన పరుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించని నీలాంటి వ్యక్తిని తెలంగాణ, నిజామాబాద్ ప్రజలు తరిమేస్తారు. నీ మీ దాడి చేసే పరిస్థితి వస్తది. దానికే నువ్వు బాధ్యుడివి అని చెప్పారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజ్యాంగం గురించి, చట్టం గురించి తెలుసుకో. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బాగుండదు. ఖబడ్దార్ అని గజ్జల కాంతం హెచ్చరించారు.