Srinivas Rao | హైదరాబాద్ : ప్రజారోగ్య సంచాలకులుగా ఐదేండ్లకు పైగా సేవలందించి, తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి ప్రజారోగ్య మాజీ సంచాలకులు గడల శ్రీనివాస్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగాను. కోవిడ్ కట్టడి కోసం అహర్నిశలు పని చేసి, సాధ్యమైనంత తక్కువ నష్టంతో రాష్ట్రాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోగలిగాం. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది అని ఆయన స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి పని చేస్తాను అని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇంతకాలం నాకు సహకరించిన వివిధ జిల్లాల వైద్య అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. కోవిడ్ కట్టడిలో హెల్త్ బీట్ రిపోర్టర్లు, మీడియా పాత్ర కీలకమైనది. ఆరోగ్యరంగంలో మంచి, చెడులను తెలియజేస్తూ మా పనితీరు మెరుగుపర్చుకునేందుకు సహకరించిన మీడియా వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.