హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కేబుల్ కారు యాక్టివిటీస్కి ఎంతో భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగిన వరల్డ్ ట్రావెల్ టూరిజం మార్ట్లో ఆయన కేబుల్ కారు యాక్టివిటీస్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో భువనగిరి కోట, దుర్గం చెరువు లాంటి పర్యాటక ప్రదేశాల వద్ద తెలంగాణ రాష్ట్రం కేబుల్ కార్ యాక్టివిటీస్ను మొదటిసారి నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన ఎన్నో ప్రాంతాలు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తున్నాయని, అలాంటి వాటిని విదేశీయులకు పరిచయం చేసేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమోషన్ నిర్వహిస్తున్నామని వివరించారు. కరోనా అనంతరం పర్యాటక రంగంలో రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధిస్తున్నదని మంత్రి వివరించారు.