హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసిన రూ.59.95 కోట్లు చట్టప్రకారమే చేశామని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కుదిరిన భూమి కొనుగోలు ఒప్పందం ప్రకారమే సదరు లావాదేవీ జరిగిందని పేర్కొన్నది. ఈ వివరాలన్నీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
గురువారం ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘ఈ కోట్ల వెనుక మతలబు’ అనే శీర్షికతో వచ్చిన కథనంపై విశాఖ ఇండస్ట్రీస్ వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ భూ లావాదేవీతోపాటు ఏడు వివిధ ఆస్తులకు సంబంధించి కంపెనీ బోర్డు 2020 అనుమతి తీసుకొన్నదని, పెరిగిన భూమి విలువ నేపథ్యంలో ప్రత్యేకంగా 2022 ఆగస్టు 5న మళ్లీ అనుమతి తీసుకొన్నదని వివరించింది. ఇందుకు చెల్లించిన అడ్వాన్స్కు ఇన్కం ట్యాక్స్ను సదరు శాఖకు చెల్లించినట్టు పేర్కొన్నది. ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలు 2021-22 బ్యాలెన్స్ షీట్లో పేర్కొనలేదని ప్రచురించడం సరికాదని, 2022-23 సంవత్సరపు బ్యాలెన్స్ షీట్లో ఉంటాయని తెలిపింది. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు (ఐడీసీ) సర్వసాధారణమని, తాము గతంలో జమున హేచరీస్కు ఇచ్చామని వివరించింది. సుశీ ఇన్ఫ్రాకు ఇచ్చిన రూ. 25 కోట్ల ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్కు సంబంధించి 2022 మార్చిలో బోర్డు అనుమతి తీసుకున్నామని, ఈ వివరాలన్నీ 2022 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లో పేర్కొన్నట్టు కంపెనీ సెక్రటరీ పేరిట విడుదలైన ప్రకటనలో వివరించారు. ఈ లావాదేవీలకు సంబంధించి తాము చేయించిన మూడు రకాల అడిటింగ్లలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు.