హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో నూతన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఒక విద్యార్థి ఒకే విద్యాసంవత్సరంలో డ్యూయల్ డిగ్రీ చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ మేరకు వర్సిటీ కొత్తగా మూడేండ్ల బీబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు డ్యూయల్ డిగ్రీగా బీబీఏ కోర్సును ఎంపిక చేసుకొనేలా అవకాశం ఇచ్చింది. బీటెక్తోపాటు బీబీఏ పూర్తి చేయడం వల్ల సాఫ్ట్వేర్, వ్యాపారం, మార్కెట్ రంగాలతోపాటు ఇతర దేశాలలో కూడా ఉద్యోగాలు పొందవచ్చని వర్సిటీ అధికారులు చెప్తున్నారు.
ముందుకొస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు
బీబీఏ డిగ్రీ కోర్సుకు డిమాండ్ పెరిగినందున జేఎన్టీయూ అనుబంధ కాలేజీలు కూడా ఈ కోర్సు పట్ల ఆసక్తి చూపుతున్నాయి. వర్సిటీ అనుమతితో ఎంబీఏతోపాటు బీబీఏను కూడా ప్రవేశ పెట్టాలని ఆయా కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అనుబంధ కాలేజీలలో కూడా ఈ కోర్సును ప్రవేశ పెట్టడానికి అనుమతులు మంజూరు చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.