హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మండుటెండను, పురుగు పుట్రను సైతం లెక్కచేయకుండా ఏజెన్సీల్లో తునికాకు సేకరణే ఉపాధిగా మలుచుకున్న అడవి బిడ్డలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు రూ.200 కోట్లను బోనస్ రూపంలో కూలీలకు చెల్లించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది ఏజెన్సీ గిరిజనులు, గిరిజనేతర కూలీలకు లబ్ధి చేకూరనున్నది. ఈ బోనస్ చెల్లింపు ప్రక్రియను సిర్పూర్ నియోజకవర్గం నుంచి అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఈ ఏడాది అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అధికారులు తునికాకు సేకరణ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ సీజన్లో ఒకో గిరిజన కుటుంబం తునికాకు సేకరణతో రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా ఆదాయం సమకూర్చుకుంటున్నది. ఏప్రిల్లో తునికాకు సేకరణ ప్రారంభమై, మే నెలతో ముగుస్తుంది.
దాదాపుగా 75 వేల మంది కూలీలకు లబ్ధి
సీజన్లో దాదాపుగా 75 వేల మంది కూలీలు తునికాకు సేకరణలో పాల్గొంటారు. స్టాండర్డ్ బ్యాగులో వెయ్యి తునికాకు కట్టలుండగా, ఒక కట్టలో 50 తునికాకులుంటాయి. ఈ సీజన్లో 2.27 లక్షల స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించి, అమ్మాలనే లక్ష్యాన్ని అటవీ అభివృద్ధి సంస్థ పెట్టుకున్నది. 2023 సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో 225 యూనిట్లలో తునికాకును అటవీ శాఖ విక్రయించనున్నది. తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తునికాకు సేకరణ చార్జీలతో పాటు రెవెన్యూ నెట్ షేర్ (బోనస్) కూడా చెల్లిస్తుంది. 2022 సీజన్లో రూ.52.88 కోట్ల విలువైన తునికాకు అమ్మింది. 2014 నుంచి 2022 వరకు సుమారు రూ.277.88 కోట్ల విలువైన 15,26,203 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించి విక్రయించింది. దీనిలో సుమారు రూ.200 కోట్ల బోనస్ (నెట్ రెవెన్యూ) రూపంలో తునికాకు కూలీలకు చెల్లించాలని నిర్ణయించారు.
నేడు సిర్పూర్ నియోజకవర్గంలో ప్రారంభించనున్న మంత్రి ఐకేరెడ్డి
తునికాకు కూలీలకు బోనస్ చెల్లింపు ప్రక్రియను సిర్పూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని అటవీ అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానేపల్లి, పెంచికల్పేటలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి తునికాకు కూలీలకు రూ.31.58 కోట్ల బోనస్ చెక్కులను మంత్రి పంపిణీ చేస్తారు.