హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 35,700 కేంద్రాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆదేశించింది. అంగన్వాడీ ప్రాంగణాన్ని శుభ్ర పరిచి పిల్లలకు ఆహ్లాదపరిచే వాతావరణాన్ని కల్పించాలని సూచించింది. శనివారం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్దేశించింది. ఈ నెల 6 నుంచి 11 వరకు అంగన్వాడీ బడిబాటలో భాగంగా అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని బడి ఈడు పిల్లలను గుర్తించటం, వారి వివరాలు సేకరించడం, చిన్నారుల తల్లితండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యాన్ని వివరించడం వంటి చర్యలు చేపడుతున్నారు. అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని టీఆర్ఎస్కేవీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నల్లా భారతి తెలిపారు.