జనగామ : ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కనీసం వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కోచింగ్ ఇప్పిస్తామన్నారు.
అందులో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి ఉచిత కోచింగ్ మెటీరియల్ను ఆవికష్కరించి మాట్లాడారు.
ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో, పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, తొర్రూరు కేంద్రాల్లో ఈ శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ శిక్షణలో ఉచిత భోజన వసతితోపాటు, మెటీరియల్ను కూడా ఉచితంగా అందిస్తారని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఉచిత శిక్షిణ తరగతులు ప్రారంభం అవుతాయని, తొర్రూరులో టెట్, పాలకుర్తిలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తారన్నారు.
ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచేత తరగుతులు నిర్వహిస్తారు. కనీసం 50 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని మంత్రి వివరించారు. ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.