హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోర్సులో ఉచిత శిక్షణకు అర్హులైన మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కోరారు. శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ద్వారా నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ అందించనున్నట్టు తెలిపారు.
డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో వచ్చే నెల 14లోపు నాంపల్లిలోని మైనారిటీ స్టడీ సర్కిల్లో హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, 15 నుంచి శిక్షణ అందించనున్నట్టు పేర్కొన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 85208 60785 నంబర్ను సంప్రదించాలని సూచించారు.