హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీలోని 1200మంది విద్యార్థులకు కండ్లద్దాలు ఉచితంగా అందజేయనున్నారు. వర్సిటీలో మొత్తం 9 వేల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1200 మంది విద్యార్థులు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి కండ్లద్దాలు పంపిణీచేసే అంశంపై ఇటీవల వర్సిటీ అధికారులు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతోపాటు వైద్యారోగ్యశాఖ అధికారులతో చర్చించారు. దాంతో విద్యార్థులకు కండ్లద్దాలు ఇచ్చేందుకు ఆయాశాఖ అధికారులు అంగీకరించారు. వారంలో వీటిని విద్యార్థులకు ఇవ్వనున్నారు.
సమస్యల పరిష్కారం
వర్సిటీలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఇటీవల రూ.40 లక్షల పెండింగ్ స్కాలర్షిప్లను ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం విడుదల చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించారు. దసరా సెలవుల్లో భవనాల మరమ్మతులు, పెయింటింగ్ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ఆర్జీయూకేటీ ప్రత్యేకతలు, విజయాలతో కూడిన డాక్యుమెంటరీని కూడా రూపొందిస్తున్నారు.