ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తుంది. ఆయకట్టు రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తుంది. మరి దూరంగా ఉన్న రైతులు చేసిన తప్పేంటి? భౌగోళిక ప్రతికూలతల దృష్ట్యా కాలువల ద్వారా సాగునీటి సరఫరా సాధ్యం కాని తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు బోర్లపైనే ఆధారపడుతున్నారు.
ప్రాజెక్టుల నీరు చేరని ఈ ప్రాంతాలవారికి ఉచితంగా సాగునీరు అందించి న్యాయం చేయాలంటే.. ఏకైక మార్గం వారికి విద్యుత్తును ఉచితంగా సరఫరా చేయడమే. దీనిని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పుబడుతున్నారు. విద్యుత్తును ఉచితంగా అందివ్వడం ప్రమాదకరమంటూ చిన్న, సన్నకారు రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తురంగ సంస్కరణల పేరుతో వ్యవసాయ మీటర్లకు తెరలేపిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు అసలు ఉచిత విద్యుత్తే ఉండకూడదని హూంకరిస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 4 కోట్ల ఇండ్లకు ఉచితంగా విద్యుత్తు కనెక్షన్ ఇస్తుంది..’ – 2017లో ‘సౌభాగ్య’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ ఇదే ప్రధాని.. ‘ఉచిత కరెంటు వంటి పథకాలు ప్రమాదరకం. ఇవి దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారవుతున్నాయి’ అని ఇటీవల ఎన్టీపీసీ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభిస్తూ వ్యాఖ్యానించారు. ప్రధాని ద్వంద్వ వైఖరికి ఈ రెండు ప్రకటనలు అద్దంపడుతున్నాయి. 2017లో దేశవ్యాప్తంగా నాలుగుకోట్ల ఇండ్లకు ఉచితంగా విద్యుత్తు కనెక్షన్ అంటూ ‘సౌభాగ్య’ పేరుతో పథకాన్ని ప్రారంభించిన మోదీ.. ఇప్పుడు రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు.
ఐదేండ్ల క్రితం ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రారంభించిన ఆయనే.. ఇప్పుడు ఉచిత కరెంటు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. కొద్దిరోజులుగా ఉచితాల అంశాన్ని ప్రధాని పదే పదే ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తుండటం, అనేక అంశాల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న రైతువ్యతిరేక వైఖరి.. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మరోమారు చర్చకు వస్తున్నాయి. కర్షకులకు కరెంటు ఇవ్వడాన్ని నేరంగా ఆయన చిత్రీకరిస్తుండటంపైనా దుమారం రేగుతున్నది. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు వేర్వేరంటూ సర్వోన్నత న్యాయస్థానం సైతం స్పష్టంచేసినా.. కేంద్రం మాత్రం సంక్షేమ పథకాలన్నింటికీ ‘తాయిలాలు’గా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తాము ఇస్తే సంక్షేమం.. అదేపని ఇతరులు చేస్తే నేరం, ఘోరం..’ అనే ధోరణిలో ప్రధాని వ్యవహరిస్తుండటాన్ని రాజకీయ విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు.
తెలంగాణలో అనివార్యం
తెలంగాణలో రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వడం అనివార్యం. భౌగోళిక అననుకూలత నేపథ్యంలో ఇక్కడి ప్రాజెక్టుల నుంచి నాన్ఆయకట్టు ప్రాంతాలకు కాలువల ద్వారా నీటి సరఫరా కష్టసాధ్యం. దిగువన ఉన్న నీటిని ఎత్తి వ్యవసాయానికి వాడుకోవాల్సిందే. దాంతో అనేకప్రాంతాల్లో రైతులు అనివార్యంగా బోర్లపై ఆధారపడాల్సి వస్తున్నది. మొదటినుంచీ బోరుబావులపై ఆధారపడిన వ్యవసాయం మనరాష్ట్రంలోనే ఎక్కువ. 2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో 19.03లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. సాగువిస్తృతి పెరిగిన నేపథ్యంలో గడిచిన 8 ఏండ్లలో 7.57లక్షలు అదనంగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 26.6 లక్షల సాగునీటి బోర్లు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అందుకే తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టావిర్భావం నుంచీ రైతులందరికీ విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్నది. 2018 నుంచీ వ్యవసాయానికి 24గంటల నిరంతరాయ విద్యుత్తును అందిస్తున్నది. ఆ రీత్యా చూసినప్పుడు తెలంగాణలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు ఉచిత విద్యుత్తే. రాష్ట్రంలోని 26.60 లక్షల సాగునీటి కనెక్షన్లకు ఉచిత నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.10వేల కోట్లకుపైగా సబ్సిడీ మొత్తాన్ని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నది. తద్వారా ప్రతి ఒక్కరికీ ఉచితంగా సాగునీరు అందుతున్నది. పండిన పంట మొత్తం రైతు కుటుంబానికే చెందుతున్నది. రైతుబంధు ద్వారా పెట్టుబడిసాయం అందించడంతోపాటు ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చుతున్నది. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. సాగుకు సన్నద్ధమయ్యే దశ నుంచీ కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తున్నది.
మీరు రాయితీలు, ఉచితాలు ఇవ్వొచ్చా?
తనకు సొంతంగా పేరొచ్చే పథకాలకు మోదీ ప్రభుత్వం రాయితీలు, ఉచితాలు ఇస్తుంటుంది. పీఎం ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. వాటి లబ్ధిదారులకు సిలిండర్ల కొనుగోలుపై రాయితీలు ఇస్తున్నారు. సాధారణ వినియోగదారులకు గ్యాస్సబ్సిడీ ఎత్తివేసి, ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.200 సబ్సిడీ కొనసాగిస్తున్నది. పైగా ఈ విషయాన్ని ప్రధాన సంక్షేమ కార్యక్రమంగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. కిసాన్ సమ్మాన్ నిధి, ఆవాస్ యోజన వంటివి కేంద్రం అమలు చేస్తున్న రాయితీ పథకాలే. తనకు సొంతగా పేరొచ్చే పథకాలు, బీజేపీకి లబ్ధి చేకూర్చే పథకాలకు మాత్రం ఉచితాలు, రాయితీలు కొనసాగిస్తూనే.. అదేపని రాష్ట్ర ప్రభుత్వాలు చేయవద్దనడం విమర్శల పాలవుతున్నది.
అటు ఉచిత నీళ్లు.. ఇటు బోర్ల బిల్లులా?
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వాలు రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. వాటికింద కోట్లాది ఎకరాల ఆయకట్టు రైతులకు కాలువల ద్వారా ఉచితంగా సాగునీటిని సరఫరా చేస్తున్నాయి. దశాబ్దాలుగా ఉచిత నీటిని వాడుకుంటున్న రైతులు కోట్లలో ఉన్నారు. ‘ఒక ప్రాజెక్టు ద్వారా దాని ఆయకట్టు రైతాంగానికి ఉచితంగా సాగునీరు లభిస్తుంటే.. మరి దూరంగా ఉన్నవారు, నాన్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటి? వారంతా కరెంటు బిల్లులు కడుతూ నీళ్లు తోడుకోవాలా?’ అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆయకట్టేతర రైతులకూ సాగునీరు ఉచితంగా అందించడం ప్రభుత్వాల బాధ్యత అని వారు గుర్తుచేస్తున్నారు. ఈ రైతులు బోరు వేయడానికి, మోటర్లకు, విద్యుత్తు కనెక్షన్కు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో వాటా కింద ఒక్కొక్కరు కనీసం రూ.2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడిగా పెడుతారు. అలాంటివారికి విద్యుత్తు బిల్లుల రూపంలో మళ్లీ రూ.వేలకు వేలు భారం మోపడం ఎంతవరకు సబబని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొందరు రైతులకు ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా నీళ్లు సరఫరా చేసి.. మరికొందరు రైతులకు వేలకు వేలు కరెంటు బిల్లులు వసూలు చేయడం ఎంతవరకు న్యాయం? దీనికి ఏకైక పరిష్కార మార్గం వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేయడమేనని ఆర్థికనిపుణులు అభిప్రాయపడుతున్నారు.