హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే గ్రూప్ -1తో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ఆరు యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్గా బుధవారం ప్రారంభించారు.
రేపట్నుంచి ఉద్యోగార్థులకు కోచింగ్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. యూనివర్సిటీల్లో ఉండి ప్రయివేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఈ కోచింగ్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతాయన్నారు. కోచింగ్ సెంటర్లలో విద్యార్థులకు ఉచితంగా మెటిరీయల్ అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వారీగా ఆయా జిల్లా కేంద్రాల్లో కోచింగ్ సెంటర్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.